Vijaysethupathi : కోలీవుడ్ లో విలక్షణమైన నటుడిగా పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతి, తన సహజమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు. సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన, తన కష్టపాటుతో ఎన్నో విజయాలు సాధించారు.  తాజాగా విడుదలైన ‘మహారాజ’ సినిమాతో విజయ్ సేతుపతి మరోసారి తన నట ప్రతిభను నిరూపించారు. ఈ సినిమా థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో కూడా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ సినిమాతో విజయ్ సేతుపతి తన కెరీర్‌లో మరో ల్యాండ్‌మార్క్‌ను సృష్టించారు.

ఇప్పటికే తన కెరీర్‌లో 50 సినిమాలు పూర్తి చేసుకున్న విజయ్ సేతుపతి, తన తదుపరి సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాను ఇకపై సహాయ పాత్రల్లో నటించబోనని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి పాండిరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. అంతేకాకుండా ట్రైన్, ‘విడుతలై-2’ అనే రెండు సినిమాలు పోస్ట్‌ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. ఈ రెండు సినిమాలు 2024 చివరి నాటికి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఇప్పుడు విజయ్ సేతుపతి లైనప్‌లోకి మరో మూవీ చేరింది. అదే బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ ‘96’ సీక్వెల్. 2018లో విడుదలైన ‘96’ మూవీ అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు దర్శకుడు సి. ప్రేమ్‌కుమార్ ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించనున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో కూడా విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించనున్నారు. 96 సీక్వెల్ గురించి వినగానే అభిమానులు ఎంతగానో ఉత్సాహంగా ఉన్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిందని దర్శకుడు తెలిపారు. విజయ్ సేతుపతి మరియు త్రిష తమ డేట్స్ ఇవ్వగానే షూటింగ్ ప్రారంభం అవుతుందని తెలిపారు.

Leave a comment

error: Content is protected !!