Trisha Krishnan : పొన్నియన్ సెల్వన్ సినిమా తర్వాత త్రిష కెరీర్ ఊపందుకుంది. ఈ సినిమాతో ఆమెకు కొత్త అవకాశాలు వచ్చి వరుసగా సినిమాలు చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, మోహన్ లాల్ , లాంటి సీనియర్ హీరోలతో కలిసి నటించే అవకాశం దొరికింది.

18 ఏళ్ల తర్వాత చిరంజీవితో కలిసి విశ్వంభర సినిమాలో నటిస్తోంది. ఇంతకు ముందు వీరిద్దరూ కలిసి స్టాలిన్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. చీకటి రాజ్యం, మన్మథ బాణం లాంటి చిత్రాల్లో గతంలో కమల్ తో కలిసి నటించగా ..  ఇప్పుడు థగ్ లైఫ్ సినిమా ద్వారా మణిరత్నం ఆమెకు మళ్ళీ అవకాశం ఇచ్చారు. ఈ విధంగా తెలుగు, తమిళ భాషల్లో తిరుగులేని నటి అని మరోసారి నిరూపించుకుంటోంది త్రిష. అలాగే.. మాలీవుడ్ కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ సరసన రామ్ అనే మలయాళ మూవీలో కథానాయికగా నటిస్తోంది.

తాజాగా 14 ఏళ్ల తర్వాత మళ్లీ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది త్రిష. సల్మాన్ ఖాన్ హీరోగా విష్ణు వర్ధన్ దర్శకత్వంలో ది బుల్ అనే సినిమాలో నటిస్తోంది. 2009లో కట్టామిట్టా అనే సినిమాతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన త్రిషకు ఆ సినిమా పెద్దగా కలిసి రాలేదు. దీంతో ఆమెకు బాలీవుడ్ లో అవకాశాలు రాలేదు.

కొన్నాళ్ళు ప్రయత్నించినా ఫలితం లేక దక్షిణ భారత సినిమాలపై దృష్టి పెట్టింది. విష్ణు వర్ధన్ కూడా తమిళ దర్శకుడు కావడంతోనే త్రిషకు ఈ అవకాశం వచ్చిందని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా ఇది త్రిషకు మంచి అవకాశం. ఈ సెకెండ్ ఛాన్స్ ను సద్వినియోగం చేసుకొని మరింత దూసుకుపోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Leave a comment

error: Content is protected !!