Tapsee Pannu : బాలీవుడ్ నటి తాప్సీ గతేడాది ఒకే ఒక్క సినిమాతో సరిపెట్టుకున్నప్పటికీ, ఈ ఏడాది వరుస చిత్రాలతో దూసుకెళ్తోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ.. తనను ప్రభావితం చేసిన పాత్రల గురించి మాట్లాడింది.  “జబ్‌ వీ మెట్‌” సినిమాలో కరీనా కపూర్ పోషించిన గీత్ పాత్ర తనను ఎంతో ప్రభావితం చేసిందని తాప్సీ తెలిపింది. ఆ పాత్ర చిత్రంలోని కొన్ని సందర్భాల్లో సామాజిక అంశాలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ, వాస్తవికతకు దగ్గరగా ఉంటుందని ఆమె అభిప్రాయపడింది. ఈ సినిమా విడుదలైనప్పుడు తాప్సీ కాలేజీలో చదువుతున్నట్లు చెప్పింది.

తాప్సీ తన మనస్తత్వం గురించి కొందరు ఎగతాళిగా మాట్లాడుతున్నారని, కొన్నిసార్లు అవి బాధపెట్టినా తన జీవితాన్ని ఏ మాత్రం ప్రభావితం చేయలేవని అభిప్రాయపడింది. తన సినీ ప్రయాణంలో ఎంచుకున్న సినిమాల విషయంలోనూ ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నానని, కానీ చిత్రాల ఎంపిక పట్ల ఇతరులు చెప్పింది చేయాలని తాను అనుకోవడం లేదని స్పష్టం చేసింది. తనకు నచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకోవాలని ఆమె కోరుకుంటుంది. తాప్సీ నటించిన ‘ఫిర్‌ ఆయీ హసీన్‌ దిల్‌రుబా’, ‘ఖేల్‌ ఖేల్‌ మే’ చిత్రాలు త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

Leave a comment

error: Content is protected !!