జానపద బ్రహ్మ విఠలాచార్య దర్శకత్వం వహించిన, నిర్మించిన సినిమాలు చూడని ప్రేక్షకులు ఉండరని అంటే అతిశయోక్తి కాదేమో! ఒకప్పటి ప్రేక్షకులు మాత్రమే కాదు, ఈతరం ప్రేక్షకులు సైతం ఆయన సినిమాలు ఏదో ఒక సమయంలో చూసే ఉంటారు. తరాలు మారినా ఆయన సినిమాలకు ఏమాత్రం ఆదరణ తగ్గలేదు. జానపద చిత్రాలు తీయడంలో విఠలాచార్య ట్రెండ్ సెట్టర్. ఆయన్ను ఎంతోమంది ఫాలో అయ్యారు. అటువంటి విఠలాచార్య సమగ్ర సినీ ప్రయాణం, ఆయన తీసిన సినిమాల వెనుక జరిగిన సంగతుల సమాహారంతో… తెలుగు సినీ చరిత్రను అక్షరబద్దం చేస్తున్న జర్నలిస్ట్, రైటర్ పులగం చిన్నారాయణ రాసిన పుస్తకం ‘జై విఠలాచార్య’. ఈ బుక్ ఫ‌స్ట్‌లుక్‌ను సూప‌ర్‌స్టార్‌ కృష్ణ విడుదల చేశారు.
‘జంధ్యా మారుతం’, ‘ఆనాటి ఆనవాళ్ళు’, ‘సినీ పూర్ణోదయం’, ‘స్వర్ణయుగపు సంగీత దర్శకులు’, ‘పసిడి తెర’, ‘సినిమా వెనుక స్టోరీలు’, ‘మాయాబజార్ మధుర స్మృతులు’, ‘వెండి చందమామలు’… ఇప్పటివరకూ పులగం చిన్నారాయణ ఎనిమిది పుస్తకాలు రాశారు. ఆయన రాసిన తొమ్మిదో పుస్తకం ‘జై విఠలాచార్య’. ‘మూవీ వాల్యూమ్’ షేక్ జిలాన్ బాషా ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేస్తున్నారు. పాఠకులకు వచ్చే నెల నుంచి ఈ పుస్తకం అందుబాటులోకి రానుంది.
‘జై విఠలాచార్య’ బుక్ ఫ‌స్ట్‌లుక్‌ విడుదల చేసిన అనంతరం సూప‌ర్‌స్టార్ కృష్ణ మాట్లాడుతూ “విఠలాచార్య గారి దర్శకత్వంలో నేను ఒకే ఒక్క సినిమా చేశాను. అది ‘ఇద్దరు మొనగాళ్లు’. ఆ సినిమా హిట్ అయ్యింది. నేను స్టూడెంట్‌గా ఉన్న రోజుల్లో ఆయన సినిమాలు చాలా చూశాను. కాంతారావు గారు హీరోగా ఆయన చాలా జానపద సినిమాలు చేశారు. నేను ఎక్కువగా యాక్షన్ సినిమాలు చేశాను. జానపద నేపథ్యంలో చేసిన సినిమాలు చాలా తక్కువ. ‘ఇద్దరు మొనగాళ్లు’ కాకుండా ‘మహాబలుడు’, ‘బొమ్మలు చెప్పిన కథ’, ‘సింహాసనం’ సినిమాలు చేశాను. ‘గూఢచారి 116’ విడుదలైన 40 రోజులకు అనుకుంట… ‘ఇద్దరు మొనగాళ్లు’ ఓకే చేశా. నేను చేసిన ఫస్ట్ మల్టీస్టారర్ కూడా ఇదే. విఠలాచార్య గారు గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. అలాగే, స‌క్సెస్‌ఫుల్ నిర్మాతగా ఆయన ఎన్నో హిట్ సినిమాలు చేశారు. ఆయన చాలా ఫాస్ట్‌గా సినిమాలు తీసేవారు. ఆయన బ‌డ్జెట్‌లో సినిమాలు తీసేవారు. ఒక దర్బార్ సెట్ వేస్తే… అందులో ఒకవైపు బెడ్ రూమ్, మరోవైపు కారిడార్ సెట్స్ వేసేవారు. ఆయన ఏ సినిమాకు అయినా ఒకటే సెట్ వేసేవారు. ఆయన ఖాళీగా ఉన్నప్పుడు వాహినీ స్టూడియోస్‌కు వచ్చేవారు. నా షూటింగులు ఎక్కువ అక్కడే జరిగేవి. మా సెట్‌కు వ‌చ్చి కూర్చుని, నాతో సరదాగా కబుర్లు చెప్పేవారు. బీఎన్ రెడ్డిగారు, చ‌క్ర‌పాణిగారు కూడా అలా సెట్స్‌కు వ‌చ్చి కూర్చునేవారు. విఠలాచార్యగారిపై పుస్తకం తీసుకు వస్తుండటం సంతోషంగా ఉంది” అని అన్నారు.

పులగం చిన్నారాయణ మాట్లాడుతూ “జానపద బహ్మ విఠలాచార్య సినీ ప్రయాణానికి సంబంధించిన సమగ్ర సమాచారంతో రాసిన పుస్తకం ‘జై విఠలాచార్య’. విఠలాచార్యగారు గొప్ప దర్శకుడు మాత్రమే కాదు, గొప్ప నిర్మాత కూడా. తక్కువ బడ్జెట్, తక్కువ లొకేషన్‌ల‌లో వేగంగా, పొదుపుగా సినిమాను ఎలా తీయవచ్చనేది ఆయన చూపించారు. సినిమా నిర్మాణంలో ఆయన పెద్ద బాలశిక్ష వారు. కరోనా సమయంలో విఠలాచార్యగారి శత జయంతి సందర్భంగా ఈ పుస్తకానికి అంకురార్పణ చేశాం. విఠలాచార్యగారు సినిమాను ఎంత వేగంగా తీసేవారో, అంతే వేగంగా ఈ పుస్తకాన్ని పూర్తి చేశాం. రచయితగా నా తొమ్మిదవ పుస్తకమిది” అని అన్నారు.
‘మూవీ వాల్యూమ్’ షేక్ జిలాన్ బాషా మాట్లాడుతూ “నేను పదమూడేళ్లుగా సినిమా జర్నలిస్టుగా ఉన్నాను. మూవీ వాల్యూమ్ పేరుతో ఒక వెబ్‌సైట్‌, యూట్యూబ్ ఛాన‌ల్ నిర్వ‌హిస్తున్నాను. ఇప్పుడు పబ్లిషింగ్ రంగంలో ప్రవేశించాను. పులగం చిన్నారాయణగారు రాసిన ‘జై విఠలాచార్య’ పుస్తకాన్ని పబ్లిష్ చేస్తున్నాను. కృష్ణగారిది గోల్డెన్ హ్యాండ్. ఆయన చేతుల మీదుగా బుక్ ఫ‌స్ట్‌లుక్‌ విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. సాధారణంగా సినిమాలకు ఫ‌స్ట్‌లుక్‌ విడుదల చేస్తుంటారు. ఓ బుక్ ఫ‌స్ట్‌లుక్‌ విడుదల చేయడం ఇదే తొలిసారి. కొత్తగా ఉంటుందని చేశాం. మా ప్రయత్నానికి సహకరించి… కృష్ణగారితో లుక్ విడుదల చేయించిన సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావుగారికి థాంక్స్. పులగం చిన్నారాయణగారు ఇప్పటివరకూ ఎనిమిది పుస్తకాలు రాశారు, ఆయన రాసిన తొమ్మిదో పుస్తకం ఇది. మూడుసార్లు ఆయన నంది పురస్కారాలు అందుకున్నారు. ఈ పుస్తకంతో మరోసారి పురస్కారం అందుకుంటారని ఆశిస్తున్నాను” అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు పాల్గొన్నారు.

Leave a comment

error: Content is protected !!