ఈ లాక్ డౌన్ వేళ.. సినీ సెలబ్రిటీస్ ఇంట్లోనే ఉంటూ.. వివిధ రకాలుగా తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటున్నారు. కొందరు ఇంటిపనుల్లో, మరికొందరు వంట పనుల్లో .. ఇంకొందరు డ్రాయింగ్ లో, మిగిలిన కొందరు వేరు వేరు రంగాల్లో తమ టాలెంట్ ను వెలుగులోకి తీసుకొస్తున్నారు. అలాంటివారి జాబితాలోకి .. ఘట్టమనేని వారి చిన్నల్లుడు సుధీర్ బాబు కూడా చేరిపోయాడు.  విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు డైలాగ్ చెప్తూ అందర్నీ అబ్బురపరిచాడు సుధీర్ బాబు  . ”క్వారంటైన్ సమయంలో లెజెండరీ హీరో నటించిన లెజెండరీ సీన్ కి డబ్బింగ్ చెప్పడానికి ట్రై చేశాను” అంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు.

ఎన్టీఆర్ నటించిన ‘దానవీరశూరకర్ణ’ చిత్రంలోని ‘ఏమంటి వేమంటివి’ అనే పవర్ ఫుల్ డైలాగ్ ఎంత పాపులర్ అనే విషయం అందరికి తెలిసిందే. ఈ డైలాగ్ చెప్పడానికి ఈ తరం హీరోలు కూడా ట్రై చేస్తూ ఉంటారు. ఈ డైలాగ్ ని ఎంతో మంది ఎన్టీఆర్ స్టైల్ లో చెప్పాలని ప్రయత్నించినప్పటికీ అంతగా అలరించలేకపోయారనే చెప్పవచ్చు. ఆయన మనవడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈ డైలాగ్ అనేక సందర్భాల్లో చెప్పారు.. కానీ ఆయన తాతగారి రిథమ్ లో మాత్రం చెప్పలేనని స్వయంగా తారక్ ఓ సందర్భంలో వెల్లడించారు. తాజాగా సుధీర్ బాబు అదే డైలాగ్ ని తనదైన స్టైల్ లో చెప్పాడు. ఎన్టీఆర్ డైలాగ్ చెబుతున్న వీడియోని పక్కన పెట్టుకుని డబ్బింగ్ చెబుతున్నట్లుగా సుధీర్ బాబు ఈ డైలాగ్ ను చెప్పారు. ఎన్టీఆర్ మాదిరిగానే అవే హావభావాలతో.. ఒకే టైమింగ్ తో చెప్పడానికి ట్రై చేసాడు. ఎన్టీఆర్ లా ఆ డైలాగ్ ఎవరూ చెప్పలేరని సుధీర్ బాబుకి కూడా తెలిసే ఉంటుంది. కానీ ఆయన ప్రయత్నాన్ని మాత్రం అందరూ మెచ్చుకుంటున్నారు.

Leave a comment

error: Content is protected !!