అతిలోక సుందరి” శ్రీదేవి వర్ధంతి నేడు శ్రీదేవి అనగానే తను ‘దివి నుంచి భువికి దిగివచ్చిన అతిలోక సుందరి’ గా గుర్తుకు వస్తుంది. ఆ పేరుకు తగ్గట్లే అందం అభినయం ఆమె సొంతం. ఆమె ఇండియన్ స్క్రీన్ పై ద ఓన్లీ లేడీ సూపర్ స్టార్. ఆమె అందానికి యువతరం దాసోహమైంది. ఆమె అభినయానికి ప్రేక్షక లోకం నీరాజనం అర్పించింది. ఆమె కోసం హీరోలు ఎదురు చూశారు. ఆమె కోసం దర్శకనిర్మాతలు సినిమాలు వాయిదాలు వేసుకున్నారు. మొదట దక్షిణాదిన తర్వాత ఉత్తరాదిన మొత్తంగా ఇండియన్ సెల్యులాయిడ్ పైనే తిరుగులేని చెరిగిపోని సంతకం చేసింది. తన సినిమా పాత్రలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన శ్రీదేవి. నేడు ఆమె వర్ధంతి సందర్భంగా శ్రీదేవి జీవిత విశేషాలను ఓసారి గుర్తు చేసుకుందాం.
తన అందంతో, అభినయంతో ఆబాలగోపాలాన్ని అలరించిన శ్రీదేవి తమిళనాడులో జన్మించారు. 1963 ఆగస్టు 13న శివకాశి ప్రాంతంలో పుట్టారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టుగా శ్రీదేవికి నాలుగేళ్ల వయసులో నే సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. ‘కందన్ కరుణయ్’ అనే తమిళ సినిమాలో ఆమె బాలనటిగా నటించారు. ఆ తర్వాత పదేళ్లకే సినిమా ఛాన్సులు క్యూ కట్టాయి. యుక్తవయసు వచ్చే నాటికి బీజీ హీరోయిన్ గా మారిపోయింది. 1976లో హీరోయిన్ గా తొలి సినిమా చేసింది శ్రీదేవి. కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘ముంద్రముదచ్చు’ మూవీలో రజనీకాంత్ కమల్ హాసన్ సరసన నటించింది. ఈ సినిమాలో శ్రీదేవి నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత వరుస ఆఫర్లు వచ్చాయి. అయితే.. తమిళనాట కమల్ హాసన్ తోనే ఎక్కువ సినిమాలు చేశారు శ్రీదేవి. వీరి జోడి హిట్ పెయిర్ గా నిలిచింది. ఆ విధంగా 1975-85 ప్రాంతంలో తమిళ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది శ్రీదేవి.
అయితే.. తెలుగు సినీ పరిశ్రమలోకి మాత్రం 1977లో ‘మా బంగారక్క’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన ‘పదహారేళ్ల వయసు’ సినిమా శ్రీదేవిని టాప్ స్టార్ గా నిలబెట్టింది. ‘పదునారు వయదినిలై’ పేరుతో తమిళ్ లో తీసిన ఈ మూవీ భారీ హిట్ కొట్టింది. ఇదే సినిమాను తెలుగులో రీమేక్ చేశారు. ఈ సినిమాలో ‘సిరిమల్లెపూవా’ అంటూ సాగిన శ్రీదేవి పాటకు యూత్ ఫిదా అయిపోయింది. ఆ విధంగా యువత కలల రాణిగా మారిపోయింది. ఆ తర్వాత తెలుగులో అగ్ర హీరోలందరితో నటించింది. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ చిరంజీవి వంటి స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది శ్రీదేవి. ఎన్టీఆర్ తో వేటగాడు బొబ్బిలిపులి కొండవీటి సింహం సర్దార్ పాపారాయుడు ఏఎన్ ఆర్ తో ప్రేమాభిషేకం ముద్దుల కొడుకు బంగారు కానుక శ్రీరంగ నీతులు చిరంజీవితో జగదేకవీరుడు అతిలోక సుందరి ఎస్పీ పరశురాం నాగార్జునతో ‘ఆఖరి పోరాటం’ వెంకటేష్ తో ‘క్షణక్షణం’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది శ్రీదేవి. తన అందచందాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టిన శ్రీదేవి.. అక్కడ కూడా జెండా పాతింది.
నవరసాలను కళ్లతోనే పలికించగల అరుదైన నటి శ్రీదేవి. ఆమె అభినయ కౌశలం ముందు అన్ని పాత్రలూ తలవంచాయంటే అతిశయోక్తి కాదు. భారతీయ సినీ వినీలాకాశంలో ఆమెది ఎన్నటికి చెరిగిపోని అందం. వెండితెరపై ఎప్పటికి వన్నె తరగని అభినయం అందుకే ఆమె దివి నుంచి భువికి దిగివచ్చిన అతిలోక సుందరి. ఆవిధంగా భారతీయ చిత్ర పరిశ్రమతో ధ్రువతారలా వెలిగిన శ్రీదేవి.. 2018 ఫిబ్రబరి 24న అనుమానస్పద రీతిలో కన్నుమూశారు. ఆమె ఈ లోకంలో లేకపోయినప్పటికి ఆమె జ్ఞాపకాలు మాత్రం తన్ను అభిమానించే ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా అతిలోక సుందరిగానే నిలిచి ఉంటారు.

Leave a comment

error: Content is protected !!