కరోనా మహమ్మారి దెబ్బ అన్నిరంగాలకు చాలా ఎక్కువగా తగిలింది . లాక్ డౌన్ కారణంగా దేశం మొత్తం స్తంభించిపోయింది. సినీ పరిశ్రమ సైతం షూటింగ్స్‌ను వాయిదా వేయడంతో సినీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న రోజువారీ సినీ కార్మికులు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఏరోజుకారోజు కూలీ చేసుకునే వారి పరిస్థితి మరింత ఘోరంగా మారింది. దీంతో వారికి కుటుంబ పోషణ కష్టంగా మారింది. దీంతో వీరికి అండగా ఉండేందుకు ఇప్పటికే చాలా మంది ముందుకు వచ్చి తమకు తోచిన సాయం చేస్తున్నారు.  ఇప్పటికే టాలీవుడ్ లో సిసిసి పేరుతో చిరంజీవి నాయకత్వంలో సహాయం అందిస్తున్నారు. కాగా.. బాలీవుడ్ హీరోలు కూడా తమ వంతు విరాళాల్ని ప్రకటిస్తున్నారు. దాదాపు స్టార్ హీరోలందరూ భారీ మొత్తంలో ప్రజలను, తమ సినిమాలకు పనిచేసే కార్మికులను ఆదుకునేందుకు విరాళంగా ఇచ్చారు. ఇక సల్మాన్ విషయానికి వస్తే బీయింగ్ హ్యూమన్ అనే సంస్థ నుంచి ఎంతో మందికి ఆర్థిక సాయం చేస్తున్నారు. తాజాగా సల్మాన్‌కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త బాలీవుడ్‌లో వైరల్ అవుతుంది. సేమ్ టు సేమ్ బాలీవుడ్ స్టార్ హీరోలను పోలివున్న వారందరి అకౌంట్స్‌లోకి రూ. 3000 చొప్పున సల్మాన్ ట్రాన్స్‌ఫర్ చేశారట. ఈ విషయం ఎవరో కాదు.. సేమ్ టు సేమ్ షారుఖ్ ఖాన్‌లా ఉండే రాజు రాహిక్వార్ తెలిపారు.

రాజు రాహిక్వార్ మాట్లాడుతూ.. ‘‘చాలా కఠినమైన రోజులను అనుభవిస్తున్నాం. నేను లండన్ మరియు యుఎస్‌లో కొన్ని ప్రదర్శనలను చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం అన్నీ రద్దయ్యాయి. మంగళవారం వరకు మాలాంటి(డబుల్స్) వారిని ఆదుకునేందుకు ఎవరు ముందుకు రాలేదు. కానీ మంగళవారం మధ్యాహ్నం 1కి బీయింగ్ హ్యూమన్ నుంచి నా ఖాతాలోకి మూడు వేల రూపాయలు వచ్చినట్లుగా సందేశం వచ్చింది. నాకే కాదు నాలాంటి డబుల్స్ అందరికీ డబ్బులు పడ్డాయి..’’ అని తెలిపారు. రెండు దశాబ్ధాలకు పైగా షారుఖ్ డూప్‌గా నటిస్తున్న రాజు.. ఇప్పుడు తనకి వచ్చిన డబ్బులతో మరికొందరిని ఆదుకునేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. అలాగే సల్మాన్‌ డబుల్ అయిన సాగర్ కూడా తన ఖాతాలోకి కూడా డబ్బులు వచ్చాయని తెలిపారు. సల్మాన్ చేసిన ఈ సాయం ఎందరికో ప్రయోజనాన్ని కలిగిస్తుందని పేర్కొన్న సాగర్.. తెలిసిన వారి ద్వారా సల్మాన్‌కు కృతజ్ఞతలు తెలియజేసినట్లుగా చెప్పారు. ఆయన కూడా తనలాంటి వారికి సహాయం చేస్తానని అన్నారు.

Leave a comment

error: Content is protected !!