కిరణ్‌ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ డైరెక్షన్‌లో ఏఎం రత్నం సమర్పణలో స్టార్‌లైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ నిర్మించిన మూవీ రూల్స్ రంజన్‌. ఔట్‌ అండ్ ఔట్ కామెడీగా రూపొందిన ఈ చిత్రం అక్టోబర్‌ 8 న రిలీజ్‌ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. చిత్ర యూనిట్ సభ్యులు, అభిమానులు, శ్రేయోభిలాషుల సమక్షంలో ఈ వేడుక వైభవంగా జరిగింది. సుప్రసిద్ధ నిర్మాతలు ఏ ఎం రత్నం, అంబికా కృష్ణ, దర్శకుడు అనుదీప్ లు ప్రత్యేక అతిథులుగా అలరించారు.

తెలుగు సినిమా చరిత్ర అనే పుస్తకం ఉంటే అందులో ఎ.ఎం.రత్నం గారికి తప్పకుండా ఒక పేజీ ఉంటుంది. అద్భుతమైన సినిమాలు తీశారు. ఎన్నో అద్భుతమైన పాటలు రాశారు. ఆయన తనయుడు తీసిన ఈ చిత్రం పక్కా హిట్‌ అవుతుంది. కిరణ్‌ అబ్బవరం వినయం ఉన్న హీరో. భవిష్యత్తులో మంచి హీరో అవుతాడు. నేహాశెట్టి అందం, అభినయంతో ఆకట్టుకుంటుంది. నవ్వులు పువ్వులు పూయించే చిత్రమిది’’ అని అన్నారు అంబికా కృష్ణ

.ఎంరత్నంగారు ఆ పేరులోనే ఒక వైబ్రేషన్‌ ఉంటుంది. ఆయన నాకు ఇచ్చిన గొప్ప అవకాశమిది. హైపర్‌ ఆది కామెడీ కుమ్మేశారు. ఆయన పండించిన హాస్యానికి రీ రికార్డింగ్‌ చేయలేకపోయా. సెకెండాఫ్‌లో పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తారు. వెన్నెల కిశోర్‌ కూడా చక్కని పాత్ర పోషించారు. కిరణ్‌ ఎంతో ఎనర్జీగా వర్క్‌ చేశారు అన్నారు మ్యూజిక్ డైరెక్టర్‌ అమ్రీష్‌.

ట్రైలర్‌, రష్‌ చూశా. చాలా నచ్చింది. ఈ చిత్రంతో దర్శకుడు మళ్లీ మంచి రోజులు మొదలవుతాయి. కిరణ్‌కి ఈ చిత్రం పెద్ద హిట్‌ కావాలి అని అన్నారు కెవి అనుదీప్‌.

తెలుగు సినిమా స్థాయిని పెంచుతున్న ప్రతి ఒక్కరికీ, ఇటీవల నేషనల్‌ అవార్డ్స్‌ అందుకున్న అందరికీ శుభాకాంక్షలు. తెలుగు సినిమా రంగం గురించి తక్కువ చేసే ప్రతి ఒక్కరూ మన సినిమా పురోగతిని చూసి అనవసరమైన మాటలు మానుకోవాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మా సినిమా అందరికీ మంచే నేర్చుకుంది. కానీ చెడు నేర్పదు. పల్లెటూరు నుంచి నగరానికి వచ్చి ఆయన్నే దేవుడిగా కొలిచే స్థాయికి ఎదగిన పెద్ద ఎన్టీఆర్‌ను చూసి కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని నేర్చుకోండి. విజయం ఎంత ముఖ్యమో, వినయం అంతే ముఖ్యమని 90 ఏళ్ల జీవితం, 75 ఏళ్ల నటన జీవితం ఉన్న ఏయన్నార్‌ను చూసి నేర్చుకోండి. అల్లూరి సీతారామరాజు లాంటి చిత్రాలు తీసి ఈ రోజుల్లో తెలుగు సినిమా స్థాయిని పెంచిన, నిర్మాతకు నష్టం వస్తే డబ్బులు తిరిగిచ్చే మంచి మనసున్న కృష్ణగారిని, ఇంటికి వచ్చింది శత్రువు అయినా అన్నం పెట్టి మాట్లాడాలనే సంస్కారం ఉన్న కృష్ణంరాజుగారి నుంచి ఎంతో నేర్చుకోవాలి. సంపాదించిన డబ్బును జాగ్రత్తగా కాపాడుకుని చూపించి, ఎవరికైనా పెట్టే స్థితిలో ఉండాలి కానీ నెట్టే స్థితిలో ఉండకూడదని చెప్పి బతికినంతకాలం రాజులా బతికిన శోభన్‌బాబుగారి నుంచి నేర్చుకోవాలి. తెలుగు సినిమాలో ఏదైనా పాత్ర దక్కితే చాలనుకుని తెలుగు సినిమానే శాసించే స్థాయికి చేరిన మెగాస్టార్‌ చిరంజీవి చూసి ‘హార్డ్‌వర్క్‌ ఎప్పుడు ఫెయిల్‌ కాదని’ నేర్చుకోండి. ఆయన తల్లికి క్యాన్సర్‌ వచ్చి మరణిస్తే అలాంటి స్థితి ఏ తల్లికి రాకూడదని బసవతారకం ఆస్పత్రిని పెట్టిన బాలకృష్ణగారిని చూసి బాగా బతకడం అంటే మనం మాత్రమే కాదు.. పక్కన వాళ్లను కూడా బతికించాలని నేర్చుకోవాలి. ఆరు పదుల వయసులో కూడా ఆరోగ్యం ఉంటే అన్ని బావుంటాయని నమ్ముతూ నవ మన్మఽధుడిలా కనిపించే నాగార్జును, నాన్న గొప్పొడు నేను కాదు.. అని గ్రహించి ముందుకెళ్లే విక్టరీ వెంకటేశ్‌, తనకు జీవితం ఇచ్చిన గురువు దాసరి నారాయణరావు దైవంగా భావించే మోహన్‌బాబుగారిని చూసి గురు భక్తిని నేర్చుకోండి. ఎంతోమంది చిన్నారుల గుండెల్ని కాపాడుతున్న మహేశ్‌బాబుని చూసి చాలా నేర్చుకోవచ్చు. 10 మంది పేదల్ని ఓ పక్క, వంద కోట్ల డబ్బు ఓ పక్క పెట్టి ఏది కావాలో కోరుకో అంటే ఈ వంద కోట్లను ఆ పదిమందికి పంచి ఆకలి తీరుస్తావాళ్ల ఆకలి తీరితే నా ఆకలి తీరినట్లే అని భావించి పవన్‌కల్యాన్‌ని చూసి నేర్చుకోండి సంపాదించడమే కాదు.. సహాయం చేయడం కూడా ముఖ్యమని. ప్రభాస్‌, రామ్‌చరణ్‌, బన్నీ, రానా, గోపీచంద్‌, సాయిధరమ్‌ తేజ్‌, వరుణ్‌ తేజ్‌, రామ్‌, ఇలా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. మా సినిమా వాళ్ల నుంచి ఇంత ఉంది నేర్చుకోండి.. అంతే కాని సినిమా వాళ్లను కించపరచవద్దు’’ అని అన్నారు హైపర్‌ ఆది.

నిర్మాణరంగంలో రత్నంగారు మాకు అండగా ఉన్నారు. దర్శకుడు వర్క్‌హాలిక్‌ పర్సన్‌. కిరణ్‌ మంచి బ్యాగ్రౌండ్‌ నుంచి వచ్చాడు. కానీ సాధారణంగా కనిపిస్తారు. నేహశెట్టి బాగా యాక్ట్‌ చేసింది. డాన్స్‌ అద్భుతంగా చేసింది’’ అని అన్నారు నిర్మాత వేమూరి మురళీకృష్ణ.

తెలుగువాడినై తమిళనాడులో అగ్ర నిర్మాతగా ఎదిగా. ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీశా. హిందీలోనూ సక్సెస్‌ అందుకున్సా. నా ప్రతి సినిమాలో సోషల్‌ మెసేజ్‌ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో ఉన్నందుకు గర్విస్తున్నాను. రాజకీయం, వ్యాపారం ఇలా అన్నిరంగాల మీద అవగాహన ఉన్నవాళ్లకే సినిమాల్లో చేయగలరు. సినిమా అనేది అంత ఈజీ కాదు. కాస్ట్‌లీ హాబీ. అలాగే రిస్క్‌తో కూడిన పని. కిరణ్‌ అబ్బవరంతో భవిష్యత్తులో మరో సినిమా చేస్తా. ఆ సినిమాను నేనే డైరెక్ట్‌ చేస్తా. ఈ సినిమా మాత్రం పెద్ద హిట్‌ అవుతుంది’’అని అన్నారు ఏఎం రత్నం.

ఇది పక్కా ఎంటర్‌టైనర్‌గా తీశా. నాకు సీనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన ‘మిస్సమ్మ’, గుండమ్మ కథ, అప్పు చేసి పప్పు కూడు వంటి చిత్రాలంటే చాలా ఇష్టం. ఆ తర్వాత పవన్‌కల్యాణ్‌ నటించిన ఖుషి, గబ్బర్‌సింగ్‌, జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు చాలా నచ్చాయి. అలాంటి చిత్రాల స్ఫూర్తితో ఈ సినిమా కామెడీగా చేశాం. నా తొలి చిత్రం 19 ఏళ్ల వయసులో చేశా. కానీ అప్పుడు నాతో పని చేసి రెహమాన్‌, తోట తరణి, పి.స్రిశీరామ్‌ వంటి సీనియర్లు పని చేశారు. ఈ చిత్రానికి నేనే సీనియర్‌ని. ఈ సినిమాకు పనిచేసిన వారంత భవిష్యత్తులో మంచి టెక్నీషియన్లు అవుతారు. వెన్నెల కిశోర్‌ పాత్ర ఈ చిత్రానికి సెకండ్‌ హీరోలాగా ఉంటుంది. వెన్నెల కిశోర్‌ ఆ పాత్ర చేయకపోతే సినిమా ఆగిపోయేదేమో. ఆది, హర్ష, వెన్నెల కిశోర్‌ కాంబినేషన్‌కు సెట్‌ చేయడానికి నాలుగు నెలలు పట్టింది. కిరణ్‌ అబ్బవరం యూట్యూబ్‌ నుంచి వచ్చి పెద్ద స్ర్కీన్‌ మీద తనెంటో నిరూపించుకున్నాడు. తమిళ నటుడు వివేక్‌గారి తర్వాత అంతటి ఈజ్‌ నాకు హైపర్‌ ఆదిలో కనిపించింది. నేను సిక్స్‌ కొట్టడానికి దొరికిన లాస్ట్‌ బాల్‌ ఇది. తప్పకుండా సిక్సర్‌ కొడతా’’ అని అన్నారు దర్శకుడు రత్నం కృష్ణ.

రాధిక పాత్ర తర్వాత అంతగా గుర్తింపు తెచ్చే చిత్రమిది. పక్కా పైసా వసూల్‌ చేస్తుంది. ఇందులో సమ్మోహనుడ పాట ఎంతగా పాపులర్‌ అయిందో తెలిసిందే. ఈ చిత్రాన్ని తన బిడ్డగా భావించి బెస్ట్‌ అవుట్‌పుట్‌ కోసం నిద్ర లేని రాత్రులు గడిపాడు దర్శకుడు. కిరణ్‌ భవిష్యత్తులో పెద్ద స్టార్‌ అవుతాడు అన్నారు నేహాశెట్టి.

దర్శకుడు రత్నం కృష్ణ పట్టువదలని విక్రమార్కుడు. నేను నటించిన ఫస్ట్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ కామెడీ సినిమా ఇది. ఈ సినిమా సక్సెస్‌ క్రెడిట్‌ అంతా దర్శకుడికే చెందుతుంది. అక్టోబర్‌ 6న వస్తున్న ఈ చిత్రానికి కుటుంబ సమేతంగా చూడండి. గడిచిన మూడేళ్లగా ఎన్నో ఎత్తుపల్లాలను చూశా. ఆ సమయంలో అభిమానులు అండగా ఉన్నారు. అభిమానులు ఇచ్చిన సపోర్ట్‌కు ఏడాది సమంలో మంచి విజయాలను అందిస్తా. అందరూ గర్వించేలా చేస్తాను’’ అని అన్నారు హీరో కిరణ్‌ అబ్బవరం.

Leave a comment

error: Content is protected !!