కరోనా మహమ్మారి యావత్ ప్రపంచంపై తన పంజా విసిరింది. పలు దేశాల ప్రజలు దాని బారిన పడ్డారు. ఆ పెను భూతం భారత్ కూ వ్యాపించి .. ఇక్కడ ప్రజల్నీ భయాందోళనకు గురి చేస్తోంది. దేశంలో పలు పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అందుకే దాని తీవ్రతను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. దాంతో రాజు నుంచి బంటు వరకూ .. పేద నుంచి ధనిక వర్గాల వరకూ ఇళ్ళకే పరిమితమయ్యారు. దీని కారణంగా దేశ వ్యాప్తంగా అత్యవసర సేవలు తప్ప మిగతా పరిశ్రమల్ని స్థంభించిపోయాయి. దీంతో షూటింగ్స్ లేక హీరోలు ఇంటిపట్టునే కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. కొంత మంది ఇంట్లో రకరకాల గేమ్స్ ఆడుతున్నారు. కొందరు బొమ్మలు గీసుకుంటున్నారు. కొందరు ఇష్టమైన సినిమాలు చేస్తూ క్వారంటైన్ టైమ్ ను సద్వినియోగం చేసుకుంటున్నారు.కానీ ఇలాంటి సమయంలోనూ ‘మిరపకాయ్, మిర్చి ’ నటి రిచా గంగోపాధ్యాయ మాత్రం తన భర్తతో కలిసి పిక్నిక్‌కి వెళ్లింది.

గత ఏడాది అమెరికాకి చెందిన తన సహాధ్యాయి జో లాంగెల్లాను పెళ్లి చేసుకొన్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా ఇంట్లోనే ఉంటూ సామాజిక దూరం పాటిస్తూ ఉన్నారట రిచా. అక్కడ ఒక్కో సమయంలో ఏదైనా అత్యవసర సామాగ్రిని కొనుగోలుకు మాత్రమే బయటకు వచ్చేవాళ్లట. అయితే తాజాగా రిచా తన భర్తతో కలిసి దగ్గరగా ఉన్న ఒరెగాన్‌ నదికి వెళ్లిందట. అయినా ఇద్దరూ సామాజిక దూరాన్ని పాటిస్తూనే ఉన్నారట. ఇదే విషయాన్ని రిచా భర్త తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ‘‘కొన్ని వారాలపాటు ఇంట్లోనే ఉంటూ దూరంగా ఉండడం అంటే మామూలు విషయం కాదు. అయినా సరే మనకు ఇష్టమైన పనులు చేస్తూ సామాజిక దూరాన్ని పాటిస్తూ సరదగా ఉండొచ్చు’’ని పేర్కొన్నాడు. తెలుగులో శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లీడర్‌’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రిచా గంగోపాధ్యాయ రవితేజతో కలిసి ‘మిరపకాయ్‌’, ప్రభాస్‌తో కలిసి ‘మిర్చి’ చిత్రంలో సందడి చేసింది.

Leave a comment

error: Content is protected !!