వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ , ఫ్రీ పబ్లిసిటీకి చిరునామా అయిన రామ్ గోపాల్ వర్మ .. టాలీవుడ్ లో మరో వివాదాత్మక చిత్రానికి శ్రీకారం చుట్టాడు. సినిమా పేరు ‘మర్డర్’. కుటుంబ కథాచిత్రం అనే కేప్షన్ తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఆనంద్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాని  నట్టి కరుణ,నట్టి క్రాంతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యోదంతం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. అమృతగా అవంచ సాహితి నటిస్తుండగా.. మారుతిరావు గా శ్రీకాంత్ అయ్యంగార్ నటించబోతున్నాడు. ఫాదర్స్ డే సందర్భంగా ఈ సినిమా పోస్టర్ ను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వర్మ విడుదల చేయగా వైరల్ గా మారింది . అయితే తాజాగా దీనిపై ప్రణయ్ భార్య అమృత స్పందించింది.

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, మర్డర్ పోస్టర్‌పై ఆమె నిప్పులు చెరిగింది. పోస్టర్ చూసిన వెంటనే ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని అమృత బాధపడింది. తన కొడుకును చూసుకుంటూ ప్రశాంతంగా జీవితాన్ని బ్రతకడానికి ప్రయత్నిస్తుంటే.. ఇప్పుడు తన జీవితంలోకి రామ్ గోపాల్ వర్మ రూపంలో కొత్త సమస్య ఎదురవుతోందని వాపోయింది. ‘నువ్వు రిలీజ్ చేసిన పోస్టర్‌తో నా జీవితానికి ఎటువంటి పోలికలు లేవు. సినిమా కోసం నువ్వు ఇంతలా దిగజారుతావని అనుకోలేదు. మా పేర్లను ఉపయోగించి నువ్వు అమ్ముకోవాలనుకుంటున్న తప్పుడు కథ . నిన్ను చూస్తే జాలి వేస్తోంది. నీపై ఎలాంటి కేసులు పెట్టను. రెస్ట్ ఇన్ పీస్‘.. అని అంటూ వర్మపై అమృత మండిపడింది. అయితే తన మర్డర్ సినిమాను ఒక కూతురు , తండ్రి కోణంలోనే ఆవిష్కరిస్తానని.. ఇందులో వారిద్దరి ప్రేమానురాగాలు, బాధే కనిపిస్తుందని..  ఏ విధమైన రాజకీయ కోణంగానీ , కుట్ర కోణంగానీ ఉండబోవని వర్మ క్లారిటీ ఇచ్చాడు . మరి ఈ సినిమా ఎన్ని వివాదాలకు దారితీస్తుందో చూడాలి.  

 

 

Leave a comment

error: Content is protected !!