రామానాయుడు…తెలుగు సినిమా యాభై సంవత్సరాల చరిత్ర . విజయా నాగిరెడ్డి ఆదర్శంగా తెర ప్రయాణం ప్రారంభించి ఎవరూ అధిగమించలేని రికార్డులు సొంతం చేసుకుని తానే ఒక చరిత్రగా మారిన మహా వ్యక్తి డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు.
తన ప్రేమనగర్ తెలుగు సినిమా పరిశ్రమను విషాదంలో ముంచి దివికేగిన ఆ మహావ్యక్తికి జయంతి సందర్భంగా నివాళులు అర్పిద్దాం.
లిపి ఉన్న అన్ని భారతీయ భాషల్లోనూ సినిమాలు తీశారు. అలా నిజమైన భారతీయుడు ఆయన.
ఆయన లేరు ఆయన నిర్మించిన చిత్రాలున్నాయి. ఆయన లేరు ఆయన వేసి పోయిన బాట ఎదుట నిలిచే ఉంది. ఆయన స్ఫూర్తి ఎప్పటికీ పరిశ్రమను నడిపిస్తూనే ఉంటుంది.
వ్యవసాయం, రైసుమిల్లు వ్యాపారం ఉండగా…ఎందుకు రామానాయుడుకు సినిమా ఫీల్డ్ మీద ఇంట్రస్టు కలిగింది. ఆయన కంటే చాలా ముందే ఆ ఊరి నుంచి సినిమాల్లో ప్రవేశించారు యార్లగడ్డ వెంకన్న చౌదరి.
తీసింది ఒకే సినిమా. పేరు నమ్మినబంటు. చాలా పెద్ద హిట్టు. అయినా మరో చిత్రం తీయలేదు. ఎందుకలా అని ఓ సీనియర్ జర్నలిస్టు అడిగితే…ఇంకేదన్నా వ్యాపారంలో డబ్బు పెట్టినోణ్ణి దేవుడిలా చూస్తారు…ఇక్కడ మాత్రమే దయ్యంలా చూస్తారు. అని ఇండస్ట్రీ గడప తొక్కననేశారు.
మేనమామ తీసిన నమ్మినబంటు ఔట్ డోర్ షూటింగుకు సంబంధించి… దాదాపు ప్రొడక్షన్ వ్యవహారాలన్నీ చూసుకున్నారు రామానాయుడు. మద్రాసు చేరి కొందరు భాగస్వాములతో కల్సి అనురాగం తీశారు. ఆ తర్వాత స్వంతంగా సురేష్ మూవీస్ ప్రాంరభించి ఎన్టీఆర్ తో రాముడు భీముడు తీసి హిట్టునందుకున్నారు.
ప్రతి మెతుకు మీదా తినేవాడి పేరు రాసిపెట్టుందంటారు…అలా రాముడు భీముడు మీద నాయుడుగారి పేరు రాసిఉంది. ఎన్టీఆర్ తో ఎక్కువ సాన్నిహిత్యం ఉన్న మిద్దే బ్రదర్స్ కు మొదట ఈ కథ చెప్పారు డి.వి.నరసరాజు.
వాళ్లు అబ్బే అనేశారు. ఇంకా ఇద్దరు ముగ్గురు నిర్మాతలు లైన్ వినే కష్టం అన్నారు. నాయుడు గారు విన్న వెంటనే అడ్వాన్స్ ఇచ్చేసి పని మొదలెట్టేశారు. హిట్టు కొట్టి ఇండస్ట్రీకి తనను పరిచయం చేసేసుకున్నారు.
రాముడు భీముడు తర్వాత ఎన్టీఆర్ తోనే పౌరాణికం ఎనౌన్స్ చేశారు రామానాయుడు. కమలాకర దర్శకత్వంలో అత్యంత భారీగా శ్రీ కృష్ణ తులాభారం నిర్మించారు. ఎన్టీఆర్ కృష్ణుడుగా… జమున సత్యభామగా నటించిన తులాభారంలో పద్యాలు అన్నీ రంగస్థలం నుంచే తీసుకున్నారు.
అదే ఆ సినిమాను విజయవంతం చేసింది. జమునకు సత్యభామగా మంచి పాపులార్టీ తెచ్చిన చిత్రం శ్రీ కృష్ణ తులాభారం.
రెండు సినిమాలూ సక్సస్ అయ్యాక వరసగా స్త్రీ జన్మ, ద్రోహి తదితర చిత్రాలు ఫ్లాపై రామానాయుడ్ని ఆర్ధికంగా బాగా కృంగదీశాయి. ఫైనల్ గా తన ఫేట్ ను డిసైడ్ చేసుకోడానికి సిద్దపడ్డారు. మళ్లీ రాముడు భీముడు టైమ్ లో ఏం జరిగిందో అదే జరిగింది. నాగేశ్వరరావు, కె.ఆర్.విజయ కాంబినేషన్ లో తీయాలనుకుని ఆగిపోయిన ప్రేమనగర్ నవల రామానాయుడు దగ్గరకు వచ్చింది. అది విచిత్రంగా నాయుడుగార్ని నిలబెట్టింది. ఇంత వాణ్ణి చేసింది.
ద్రోహి దెబ్బతిన్న తర్వాత విజయవాడ నవయుగ ఆఫీసులో ప్రేమనగర్ చిత్ర నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. ఆ ఏటి సూపర్ హిట్ మూవీ దసరా బుల్లోడును మించి 15 లక్షల బడ్జట్ తో ప్రేమనగర్ అనౌన్స్ చేశారు. ఆ మూవీ ఫ్లాప్ అయితే ఇక ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేద్దామనేది ఆయన ఆలోచన. ప్రేమనగర్ సక్సస్ కావడమే కాదు…రిపీట్ రన్స్ లో కూడా భారీ లాభాలు తెచ్చి … సురేష్ మూవీస్ పాలిట ఏటీఎమ్ గా మారింది.
ఇండస్ట్రీలో అందరు హీరోలతోనూ సన్నిహిత సంబంధాలున్న నిర్మాత రామానాయుడు. సురేష్ మూవీస్ కేవలం ఫలానా హీరోతోనే సినిమాలు తీస్తుందనే మాట వినడం నాయుడుగారికి ఇష్టం ఉండదు.
అక్కినేనితో ప్రేమనగర్, సెక్రటరీ లాంటి అపురూప విజయాలు అందుకున్న రామానాయుడు…శోభన్ బాబుతో సోగ్గాడు తీసి బాక్సాఫీసును కొల్లగొట్టారు.
మల్టీ స్టారర్లు తీయడంలోనూ…వాటిని అభిమానులకు కన్నులపండగలా తీర్చిదిద్దడంలోనూ నాయుడుగారిని మించిన వారు లేరు. కృష్ణ శోభన్ బాబులతో ఆయన తీసిన రెండు మల్టీ స్టారర్లూ ఒకదాన్ని మించి మరోటి సక్సస్ కావడం చూస్తేనే అర్ధమౌతుంది నాయుడుగారి ప్లానింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో. మండే గుండెలు, ముందడుగు రెండూ బాక్సాఫీసు దగ్గర అపురూప విజయాలు నమోదు చేశాయి.
1985 ప్రాంతాల్లో రామానాయుడు సూపర్ స్టార్ కృష్ణతో సినిమా ప్లాన్ చేశారు. అయితే అప్పుడు కృష్ణ చాలా బిజీగా ఉండడంతో డేట్స్ ఎడ్జస్ట్ చేయడం కష్టమనేశారు.
దీంతో తన రెండో కుమారుడు వెంకటేశ్ ను హీరోగా పరిచయం చేసేయాలనే నిర్ణయానికి వచ్చారు రామానాయుడు. అంతే రాఘవేంద్రరావు డైరక్షన్ లో కలియుగ పాండవులు అనౌన్స్ చేశారు. హిట్టు కొట్టారు.
రామానాయుడు లాంటి డెడికేషన్ ఉన్న నిర్మాత ఇండస్ట్రీలో మరొకరు కనిపించరు. సినిమాలు తీయడం బాధ్యతగా భావించి తీశారాయన. జయాపజయాలకు చెదరిపోని మనో నిబ్బరం నాయుడుగారి సొంతం. నిర్మాణ సంస్ధతో ఆగకుండా సినిమాకు సంబంధించి అన్ని విభాగాలను స్వంతగా ఏర్పాటు చేశారు.
స్టూడియో, కలర్ ల్యాబ్, డిస్ట్రిబ్యూషన్, చివరకు పోస్టర్ ప్రింటింగ్ తో సహా అన్ని విభాగాల్లోకీ విస్తరించారు. ఇండస్ట్రీలో సంపాదించింది అక్కడే ఇన్వెస్ట్ చేయడం మామూలు విషయం కాదు…
కేవలం కమర్షియల్ సినిమాలు తీయడమే కాదు…జాతీయ స్థాయిలో అవార్టులు కొట్టాలనేది రామానాయుడి ఆశయం. అందుకు తగ్గట్టే అభ్యుదయ దర్శకుడు బి.నరసింగరావు దర్శకత్వంలో హరివిల్లు సినిమా తీశారు. సాధారణంగా లాభాలకోసమే ఎవరైనా సినిమా తీస్తారు. కానీ నాయుడుగారు అన్ని పన్లూ డబ్బుల కోసమే చేయాలనుకోవడం సరికాదనేవారు.
దేశంలోని అన్ని భాషల్లోనూ చిత్రనిర్మాణం చేయాలనుకున్నారు రామానాయుడు. కలకనడమే కాదు దాన్ని వాస్తవరూపంలోకి తీసుకువచ్చి తన ప్రత్యేకతను చాటుకున్నారు.
శతాధిక చిత్ర నిర్మాతగా గిన్నీస్ బుక్ రికార్టు అందుకున్నారు. ఇరవై ఒక్క మంది కొత్త దర్శకుల్ని, వారి అబ్బాయి వెంకటేష్ సహా ఆరుగురు హీరోలను, 12 మంది హీరోయిన్లను, ఏడుగురు సంగీత దర్శకులను పరిచయం చేసిన ఘనత కూడా నాయుడుగారిదే.
ఔత్సాహిక నిర్మాతగా ప్రయాణం ప్రారంభించి మూవీ మొఘల్ గా ఎదిగిన రామానాయుడు తెలుగువారికి ఓ మాట ఇచ్చారు. నాయుడుగారు మెగాఫోన్ పట్టుకుని దర్శకత్వం వహించాలనేది తెలుగువారి ఆశ. నాయుడుగారు కూడా చివరి వరకు తాను ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకుంటాననే అన్నారు. మరి ఎందుచేతో వెళ్లిపోయారు. ఆ మాట కోసమైనా మళ్లీ పుడతారని ఆశిద్దాం.
Writer – Bharadwaja Rangavajhala
