Priyanka Mohan : తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముఖం ప్రియాంక మోహన్. ఆరేళ్ల క్రితం నానితో ‘గ్యాంగ్ లీడర్’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ, తర్వాత శర్వానంద్‌తోనూ నటించింది. అయితే, ఆ రెండు చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి.

దీంతో తమిళ సినిమాల్లో అవకాశాలను అందిపుచ్చుకున్న ప్రియాంక, శివ కార్తికేయన్‌తో కలిసి ‘డాక్టర్’, ‘డాన్’ వంటి హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సూర్య లాంటి స్టార్ హీరో సరసన నటించడంతో ఆమె కెరీర్ మరింతగా ఊపందుకుంది. అయితే, ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రం తమిళంలో సగటు సినిమాగా నిలిచినప్పటికీ, ఇతర భాషల్లో ఫ్లాప్ అయ్యింది.

అయితే, ప్రియాంక మోహన్‌కు అదృష్టం మళ్లీ మారింది. రెండోసారి నానితో జోడీ కట్టిన ‘ సరిపోదా శనివారం’ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం ఏకంగా వంద కోట్ల గ్రాసర్‌గా నిలిచి ప్రియాంక కెరీర్‌కు మరో మలుపు తిప్పింది.  ‘ సరిపోదా శనివారం’ చిత్రాన్ని నిర్మించిన డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో ‘ఓజీ’ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోనూ హీరోయిన్‌గా ప్రియాంక మోహన్‌నే ఎంపిక చేసుకున్నారు. అయితే, ఈ చిత్రం విడుదల కావడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది.

తాజాగా, ప్రియాంక మోహన్ విశ్వక్ సేన్‌తో కలిసి నటించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ‘జాతిరత్నాలు’, ‘ప్రిన్స్’ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తననే ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ దాదాపు కన్ఫర్మ్ అయినట్లే.

ఫామ్‌లో ఉన్న హీరోయిన్లను ఎంచుకోవడంలో విశ్వక్ సేన్ పాటిస్తున్న స్ట్రాటజీ ఇప్పటికే కొన్ని సినిమాల్లో వర్కౌట్ అయ్యింది. ‘మెకానిక్ రాకీ’లో మీనాక్షి చౌదరి, ‘లైలా’లో ఆకాంక్ష శర్మను ఎంచుకున్న విశ్వక్, ఇప్పుడు ప్రియాంక మోహన్‌ను లాక్ చేసుకునే పనిలో ఉన్నారు. ‘గ్యాంగ్ అఫ్ గోదావరి’ చిత్రం నిరాశ పరచడంతో విశ్వక్ కొత్త తరహా సబ్జెక్టులను ఎంచుకునే పనిలో పడ్డాడు. ‘లైలా’లో ఏకంగా అమ్మాయి గెటప్‌లో కనిపించేందుకు సిద్ధమయ్యాడు. ఇక కెవి అనుదీప్ రాసుకున్న స్టోరీ మాత్రం పూర్తి వినోదాత్మకంగా ఉంటుందని టాక్.

Leave a comment

error: Content is protected !!