నాగమహేష్, రూపాలక్ష్మి, ‘బాహుబలి’ ప్రభాకర్, రచ్చ రవి తదితరులు ప్రధాన పాత్రల్లో, రమేష్ అనెగౌని దర్శకత్వంలో, మంజుల చవన్, రమేష్‌గౌడ్ అనెగౌని నిర్మాతలుగా, రామారాజ్యం మూవీ మేకర్స్, అనంతలక్ష్మి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ ‘కర్మణి’. ఈ మూవీ తాజాగా ఫిలింనగర్ దైవసన్నిధానంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా దేవుని చిత్రపటాలపై సీనియర్ నటుడు నాగమహేష్ క్లాప్ కొట్టారు. నిర్మాత మంజుల చవన్ కెమెరా స్విచాన్ చేశారు.

2022లో దర్శకుడు రమేష్ అనెగౌని తెరకెక్కించిన ‘మన్నించవా..’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. అదే ఉత్సాహంతో, అదే టీమ్‌తో కలిసి చేస్తున్న తాజా క్రేజీ ప్రాజెక్ట్ ‘కర్మణి’. ఈ సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు రమేష్ అనెగౌని మాట్లాడుతూ, ‘‘ఫిలింనగర్ దైవసన్నిధానంలో ప్రారంభోత్సవం జరిగే సినిమాలు సూపర్ హిట్ కొడతాయి. ఈ సెంటిమెంట్ మా ‘కర్మణి’ సినిమాకు కూడా కలుగుతుందని విశ్వాసం ఉంది. మే మొదటి వారంలో తొలి షెడ్యూల్ ప్రారంభిస్తున్నాం. పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తాం’’ అని తెలిపారు. నిర్మాత మంజుల చవన్ మాట్లాడుతూ, ‘‘ఫిలింనగర్ దైవసన్నిధానంలో మా ‘కర్మణి’ సినిమా ప్రారంభోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మంచి టాలెంట్ ఉన్న టీమ్‌తోనే సినిమా చేస్తున్నాం. ఇండస్ట్రీకి ఒక మంచి సినిమా అందిస్తామ‌ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం’’ అని అన్నారు.

Leave a comment

error: Content is protected !!