Kamal Haasan : 28 సంవత్సరాల క్రితం వచ్చిన ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన ‘భారతీయుడు 2’ చిత్రం జులై 12న విడుదల కానుంది. కమల్ హాసన్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని శంకర్ దర్శకత్వం వహించారు. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించగా, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

ఇటీవల చెన్నైలో జరిగిన పాటల విడుదల వేడుకలో కమల్ హాసన్, శంకర్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ, “28 సంవత్సరాల క్రితం నేను శివాజీ గణేశన్‌తో ఒక సినిమా చేయాలనుకుంటున్న సమయంలో శంకర్ ‘భారతీయుడు’ కథతో నా దగ్గరకు వచ్చారు. ఆ కథలు రెండూ కొంచెం దగ్గరగా ఉండటంతో శివాజీ గణేశన్‌కు చెప్పాను. ఆయన ‘శంకర్‌తోనే సినిమా చేయండి.. మనం ఇప్పటికే ఎన్నో చిత్రాలు కలిసి చేశాం’ అని నాతో అన్నారు. ఆ ఒక్క మాట, నమ్మకంతో ‘భారతీయుడు’ చేశాను. అప్పట్లోనే నేను సీక్వెల్ చేద్దామని అడిగాను. కానీ, శంకర్ కథ రెడీగా లేదన్నారు. మళ్లీ 28 సంవత్సరాలకు ‘భారతీయుడు 2’ చేశాం. నిర్మాత సుభాస్కరన్ వల్లే ఈ చిత్రం ఇక్కడి వరకు వచ్చింది. ఆయన మాపై పెట్టిన నమ్మకమే ఈ సినిమా. అనిరుధ్ దీనికి అద్భుతమైన సంగీతమందించారు” అని అన్నారు.

“భారతీయుడు తాత మంచి వాళ్లకు మంచివాడు.. చెడ్డవాళ్లకు చెడ్డవాడు. కమల్ హాసన్ 360 డిగ్రీల కంటే ఒక డిగ్రీ ఎక్కువ నటించే సత్తా ఉన్న నటుడు. 70 రోజుల పాటు మేకప్‌తో నటించారు. ఆయన లాంటి నటుడు ప్రపంచంలోనే లేరు. తనతో ‘భారతీయుడు 2’, ‘భారతీయుడు 3’ చేయడం ఆనందంగా ఉంది. ఈ రెండూ ‘భారతీయుడు’ కంటే పెద్ద హిట్ అవుతాయి” అని దర్శకుడు శంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో అనిరుధ్, బాబీ సింహా, గుల్షన్ గ్రోవర్, జ్ఞానాంబిక, బ్రహ్మానందం, రకుల్, కాజల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

error: Content is protected !!