Kajal Agarwal : రెండు దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణం చేస్తున్న తెలుగు నటి కాజల్‌ అగర్వాల్‌, పెళ్లి తర్వాత కొత్త రకమైన కథలపై దృష్టి పెట్టింది. ఆమె నటించిన తాజా చిత్రం ‘సత్యభామ’ ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా కాజల్‌ మీడియాతో ముచ్చటించింది.

రాజకీయాలపై తనకు అంతగా తెలియదని, కానీ బాలకృష్ణ, పవన్‌కల్యాణ్‌ వంటి నటులు తనకు వ్యక్తిగతంగా తెలుసని, ఇద్దరూ అద్భుతమైన వ్యక్తులని, వారి నాయకత్వ లక్షణాలు గొప్పగా ఉంటాయని కాజల్‌ అభిప్రాయపడింది. చాలా కథలు విన్నానని, కొన్ని చేశానని, కానీ ఆశించిన ఫలితం రాలేదని చెప్పింది. ‘గూఢచారి’, ‘మేజర్‌’ చిత్రాలతో తన సత్తా చాటిన దర్శకుడు శశికిరణ్‌ తిక్క ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు, సుమన్‌ చిక్కాల వంటి బృందం కలిసి ఈ కథను తయారు చేయడం వల్ల తనకు నమ్మకం కలిగిందని తెలిపింది.

ఈ చిత్రంలో నటించడం వల్ల తనకు ఒత్తిడి కంటే బాధ్యత మరింతగా పెరిగినట్టు అనిపించిందని కాజల్‌ తెలిపింది. మిగతా సినిమాలతో పోలిస్తే ఇంకొంచెం ఎక్కువ కష్టపడి పనిచేయాల్సి వచ్చిందని, ఈ సవాళ్లను స్వీకరించినప్పుడే నటిగానైనా, వ్యక్తిగతంగానైనా ఎదిగేదని అభిప్రాయపడింది.

ఇప్పటివరకు ఎన్నో పాత్రలు చేసినా, ఇలాంటి భావోద్వేగ భరితమైన సినిమాలో నటించడం ఇదే తొలిసారి అని కాజల్‌ వెల్లడించింది. యాక్షన్‌ సన్నివేశాలలో నటించడం కూడా ఒక సవాల్‌గా స్వీకరించిందని, మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో తర్ఫీదు తనకు ఈ చిత్రంలో బాగా పనిచేసిందని తెలిపింది. ఈ చిత్రంలో యువతకు సంబంధించి ఆలోచింపజేసే అంశాలు చాలా ఉంటాయని కాజల్‌ చెప్పింది. మతం కోణం కూడా ఉంటుంది కానీ, ఒకరికి వ్యతిరేకంగానో, మరొకరికి అనుకూలంగానో ఆ కోణాన్ని స్పృశించలేదని తెలిపింది.

Leave a comment

error: Content is protected !!