Janvi kapoor : బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన కథా ఎంపికల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ ఇటీవల ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ చిత్రంలో నటించింది. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ ఈ చిత్రం గురించి తన అనుభవాలను పంచుకుంది.

“మిస్టర్ అండ్ మిసెస్ మహి” మనసును హత్తుకునే భావోద్వేగాలు, మంచి విలువలతో నిర్మించిన చిత్రం. కుటుంబ సమేతంగా చూడదగిన ఈ చిత్రం యువతకు స్ఫూర్తినిస్తుంది. ఒక వ్యక్తి తన కలలను నిజం చేసుకోవడానికి కుటుంబ తోడ్పాటు ఎంత అవసరమో ఈ చిత్రం చూపిస్తుంది” అని జాన్వీ తెలిపింది.

“నేను ఎప్పటి నుంచో భిన్నమైన కథలు, పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాను. కానీ ఈ చిత్రంలో మీరు మరో కొత్త జాన్వీ కపూర్‌ను చూస్తారు. ఈ పాత్ర కోసం నేను మానసికంగా, శారీరకంగా చాలా కష్టపడ్డాను. ఇప్పటివరకు నేను చేసిన పాత్రలన్నింటి కన్నా ఈ చిత్రంలోని మహి పాత్ర నాకు చాలా ఉత్సాహాన్ని, అనుభూతిని ఇచ్చింది. ఇంతకు ముందు ఏ పాత్ర కోసం ఇంతలా ప్రత్యేకంగా శిక్షణ తీసుకోలేదు” అని జాన్వీ వివరించింది.

“నేను ఎంచుకునే ప్రతి పాత్రలోనూ కొత్తదనం ఉండేలా చూసుకుంటాను. ఇప్పటివరకు రెండు సినిమాల్లో పెళ్లయిన అమ్మాయిగా నటించాను. ఇలాంటి పాత్రల్లో నటించడం వల్ల వివాహ పద్ధతుల గురించి సులభంగా తెలుసుకోగలుగుతున్నాను. ఈ పాత్రల నేపథ్యం ఏంటి? వైవాహిక అనుబంధాలు ఎలా ఉంటాయి? ఇలాంటివన్నీ నేను పరిగణించవలసిన ముఖ్యమైన అంశాలు” అని జాన్వీ తెలియజేసింది.

“ఈ చిత్రం కోసం నేను క్రికెట్ శిక్షణ తీసుకున్నాను. నా కోచ్‌లు నన్ను క్రికెట్ అభిమానిగా మార్చేశారు. క్రికెట్‌కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించే సమయంలో నేను చాలాసార్లు గాయపడ్డాను. గాయాల భరించలేక కొన్నిసార్లు ఈ సినిమా నుంచి తప్పుకోవాలనుకున్నాను. కానీ తర్వాత మనసు మార్చుకొని, ఎన్నో సవాళ్లను అధిగమించి ప్రతి సీన్ సహజంగా రావడానికి ఎంతో కష్టపడ్డాను” అని జాన్వీకపూర్ తెలిపింది.

 

Leave a comment

error: Content is protected !!