తెలుగు సినీ పరిశ్రమ స్టార్ పిఆర్ఓ బి ఏ రాజు ఆరోగ్య సమస్యల కారణంగా మనకి దూరమయ్యి సంవత్సరం అవుతోంది (మే 21). ఆయనని స్మరించుకుంటూ ప్రథమ వర్ధంతిని ఆయన కుటుంబ సభ్యులు నేడు హైదరాబాద్ లో ఫిల్మ్ నగర్ కల్చరల్ సొసైటీ నందు జరిపించారు.

ఈ కార్యక్రమానికి హాజరైన రాజు గారి స్నేహితులు, తోటి పాత్రికేయ మిత్రులు పరిశ్రమతో ఆయనకి ఉన్న విడదీయరాని బంధాన్ని, పాత్రికేయ ప్రపంచంలో ఆయన కార్యదక్షతను, రాజు గారు అందించిన వెలకట్టలేని సేవలను గుర్తు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ దర్శకులు ఎస్ వి కృష్ణ రెడ్డి గారు, నిర్మాత కె అచ్చి రెడ్డి గారు, నిర్మాత సి కళ్యాణ్ గారు, దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గారు, హీరో అశోక్ గల్లా, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరి రావు గారు, నిర్మాత ఎం ఎస్ రాజు గారు, నిర్మాత బండ్ల గణేష్ గారు మరియు తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ కుటుంబం హాజరయ్యారు.

బి ఏ రాజు గారి ప్రస్థానం
సంపాదకీయునిగా, ప్రచారకర్తగా, నిర్మాతగా బి ఏ రాజు గారిది దశాబ్దాల ప్రయాణం. అన్ని పదుల సంవత్సరాలు అగ్రస్థాయి పీఆర్ఓ గా పనిచేయడం రాజు గారికి ఒక్కరికే సాధ్యం అయిన ఘనత. 1600 చిత్రాలకు పైగా ఆయన ప్రచారకర్త గా పనిచేశారు.

పాత తరం వారికి బి ఏ రాజు, లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ గారికి అభిమానిగా, అత్యంత ఆత్మీయునిగా చిరపరిచితం. తర్వాతి రోజుల్లో ఆయన జర్నలిస్ట్ గా వృత్తి పట్ల నిబద్ధతతో అంచలంచెలుగా ఎదిగి పరిశ్రమలో టాప్ స్టార్స్ కి తన వ్యక్తిత్వం తో సన్నిహితులు అయ్యారు. ఆయనకు పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలతో ఉన్న అనుబంధం రెండు దశాబ్దాలకు పైనే. ఆయన సూచనలు, అభిప్రాయాలకు పెద్ద హీరోలు, దర్శక నిర్మాతలు సైతం ఎంతో విలువ ఇచ్చేవారు.

సర్కారు వారి పాట చిత్ర ప్రమోషన్ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ రాజు గారితో తనకి ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఆయన లేని లోటు తీర్చలేనిది అన్నారు.

Leave a comment

error: Content is protected !!