Fashion sequel : బాలీవుడ్‌ ఇప్పుడు సీక్వెల్స్‌తో నిండిపోయింది. ప్రేక్షకులను అలరించిన చిత్రాలకు కొనసాగింపుగా సీక్వెల్స్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే 20-25 ఏళ్ల క్రితం విడుదలైన హిట్‌ చిత్రాలను కూడా తిరిగి తెరపైకి తెస్తున్నారు. ఇటీవలే 27 ఏళ్ల క్రితం విడుదలైన ‘బోర్డర్‌’ సినిమాకు సీక్వెల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో వార్త సినీ ప్రేమికులను ఆశ్చర్యపరుస్తోంది. 16 ఏళ్ల క్రితం ప్రియాంక చోప్రా, కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రల్లో మధుర బండార్కర్‌ తెరకెక్కించిన ‘ఫ్యాషన్‌’ సినిమాకు సీక్వెల్‌ రాబోతున్నట్లు తెలుస్తోంది.

2008లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఒక వ్యక్తి ఫ్యాషన్‌ రంగంలో సూపర్‌ మోడల్‌గా ఎదగడానికి ఎదుర్కొనే కష్టాలను ఈ చిత్రం చూపించింది. ఈ చిత్రానికి ప్రియాంక చోప్రా, కంగనా రనౌత్‌ ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డులు కూడా అందుకున్నారు.

రోనీ స్క్రూవాలా ఈ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌ ప్రకటించి అభిమానులను సర్‌ప్రైజ్‌ చేశారు. మధుర బండార్కర్‌ ఈ సినిమాకు కొనసాగింపు కథను సిద్ధం చేస్తున్నారు. నేటి తరంలో మోడలింగ్ రంగం ఎలా ఉంది? ఇప్పుడెలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి? వంటి అంశాల ఆధారంగా సీక్వెల్‌ కథను రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, కంగనా రనౌత్‌ నటిస్తారా లేదా కొత్త ముఖాలను తెరపైకి తెస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

Leave a comment

error: Content is protected !!