కవ్వించే ఆమె కళ్ళు కోటి కథలు చెబుతాయి. ఆమె చిలిపి చిరునవ్వు .. అందరినీ కనికట్టు చేస్తుంది. అందాల ఆమె ముఖం విడదీయరాని బంధమేస్తుంది. జెస్సీగా కుర్రకారును అందంగా మాయచేసి.. జాను గా హృదయాల్ని తీయగా మెలిపెట్టిన ఆ సుందరి సమంతా అక్కినేని. ఇటు గ్లామర్ ను, అటు పెర్ఫార్మెన్స్ ను బ్యాలెన్సింగ్ గా తెరమీద పండించగలిగిన టాలెంటెడ్ నటీమణి ఆమె.  ఎన్టీఆర్, మహేష్‌బాబు, పవన్‌కల్యాణ్, రామ్‌చరణ్, అల్లు అర్జున్‌ వంటి అగ్ర కథానాయకులతో కలిసి నటించే అవకాశాలు అందుకుంది. ప్రతి సినిమాతోనూ ఓ మెట్టు ఎక్కింది సమంత. అటు కమర్షియల్‌ కథలకి తగ్గ కథానాయికగా… నటనకి ప్రాధాన్యమున్న పాత్రలకి కేరాఫ్‌గా నిలుస్తూ అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలుగుతోంది. ఇప్పుడు సమంత అంటే ఓ బ్రాండ్‌. ఆమె సినిమాలో నటిస్తుందంటే అంచనాలు అమాంతం పెరిగిపోతుంటాయి.

చెన్నైలో పుట్టిన సమంత.. అక్కడే డిగ్రీ చదువుకుంది. డిగ్రీ చివరి సంవత్సరంలోనే మోడలింగ్‌వైపు అడుగులేసిన ఆమె దర్శకుడు రవివర్మన్‌ దృష్టిలో పడ్డారు. ఆయన దర్శకత్వం వహించిన ‘మాస్కోవిన్‌ కావేరీ’ చిత్రంలో కథానాయికగా అవకాశం అందుకుంది. కానీ సమంత జీవితాన్ని మలుపు తిప్పింది మాత్రం గౌతమ్‌ మేనన్‌. ఆయన దర్శకత్వం వహించిన ‘ఏ మాయ చేసావె’లో నాగచైతన్య సరసన సమంత నటించింది. ఆ చిత్రం ఘన విజయం సాధించడంతోపాటు, సమంత అందం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. దాంతో ఆమెకి తెలుగులో అవకాశాలు వెల్లువెత్తాయి. ఎన్టీఆర్‌తో ‘బృందావనం’, మహేష్‌తో  ‘దూకుడు’, రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఈగ’ చిత్రాల్లో వరుసగా అవకాశాలు అందుకుంది. ఆ చిత్రాలు ఘన విజయం సాధించడంతో అగ్ర కథానాయికగా ఎదిగింది సమంత. ‘ఎటో వెళ్లిపోయింది మనసు’తో నటన పరంగా కూడా తన ప్రతిభని చాటి చెప్పింది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘అత్తారింటికి దారేది’, ‘మనం’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘అఆ’, ‘రంగస్థలం’, ‘మహానటి’, ‘యు టర్న్‌’తో పాటు… ఇటీవల విడుదలైన ‘యు టర్న్‌’ సమంతకి ఎంతగానో పేరు తీసుకొచ్చాయి. ప్రస్తుతం నందినిరెడ్డి దర్శకత్వంలో ‘ఓ బేబీ’తో పాటు, నాగార్జునతో ‘మన్మథుడు2’లో నటించింది  సమంత. తెలుగులో తొలి చిత్రం చేస్తున్నప్పుడే సహ నటుడైన నాగచైతన్యతో ప్రేమలో పడిన సమంత, ఇద్దరూ కొన్నాళ్లపాటు సహజీవనం చేశారు. ఆ తర్వాత పెళ్లితో ఒక్కటయ్యారు. నేడు సమంత పుట్టినరోజు.  ఈ సందర్భంగా ఆ అందాల జాను కు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

Leave a comment

error: Content is protected !!