Kollywood : సూపర్‌స్టార్ రజనీకాంత్, దిగ్గజ దర్శకుడు మణిరత్నం మళ్లీ కలిసి పని చేయబోతున్నట్లు తెలుస్తోంది. 33 ఏళ్ల తర్వాత ఈ జోడి తిరిగి తెరపై కనిపించనుందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 1991లో వచ్చిన ‘దళపతి’ సినిమాతో ఈ జోడి అద్భుత విజయాన్ని అందుకుంది. అప్పటి నుంచి ఈ ఇద్దరూ కలిసి పని చేయలేదు. ఇప్పుడు తిరిగి వారి కాంబోలో వస్తున్న సినిమాపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

ఈ ప్రాజెక్ట్‌ విషయమై రజనీకాంత్, మణిరత్నం ఇప్పటికే చర్చలు జరిపారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది డిసెంబర్‌లో రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రజనీకాంత్ ‘వేట్టయన్’ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా ‘కూలీ’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ‘జైలర్ 2’ కూడా పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉంది. ఇద్దరు యువ దర్శకులు ఆయన కోసం కథలు సిద్ధం చేస్తున్నారు.

మణిరత్నం ప్రస్తుతం కమల్ హాసన్‌తో ‘థగ్‌ లైఫ్‌’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది. రజనీకాంత్, మణిరత్నం కలయికలో వస్తున్న ఈ కొత్త సినిమా తమిళ సినీ చరిత్రలో మరో మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!