ఏ పాట ఏ సినిమా కోసం పుట్టి  ఉంటుందో? ఏ నాయకా నాయికలమీద చిత్రీరించాలని రాసి పెట్టి ఉంటుందో ఎవరికీ తెలియదు.  అయితే ఇక్కడ తమాషా ఏంటంటే… కొందరు దర్శకులు సందర్భం కలిసిరాలేదని వదిపెట్టేసిన కొన్ని ట్యూన్స్ .. వేరే వారి కోసం వినియోగిస్తే .. ఆ పాటలు సూపర్ హిట్టయిపోతాయి. ఆ తరహా పాటలు మనకి చాలా కనిపిస్తాయి. క్రిమినల్ సినిమాలోని కీరవాణి ట్యూన్ చేసిన తెలుసా? మనసా? సాంగ్  అలాంటిదే . మహేశ్ భట్ దర్శకత్వంలో నాగార్జున నటించిన  సినిమాకి కీరవాణి సంగీతం అందించాడన్న సంగతి తెలిసిందే. అయితే ఈ పాటను ముందుగా కీరవాణి .. జగపతిబాబు సినిమా కోసం కట్టడం విశేషం. సినిమా పేరు అల్లరి ప్రేమికుడు.

రంభ, సౌందర్య, కాంచన్, రమ్యకృష్ణ నాయికలు. ఓ సన్నివేశంలో సౌందర్య.. జగపతిబాబుని పెళ్లి చేసుకుంటాను, పెళ్లి ముహూర్తం చూడు అని బామ్మ నిర్మలకు చెప్తుంది. ఆ ఆనందాన్ని టేబుల్‌పై ఉన్న చిలక బొమ్మతో పంచుకుంటుంది. చిలకలో జగపతి బాబుని ఊహించుకుని ఐ లవ్‌ యు అని చెప్పగా.. చిలక కూడా ఐ లవ్‌ యు అని సమాధానం వస్తుంది. ఇక్కడ ఓ పాట కావాలని రాఘవేంద్రరావు.. కీరవాణికి సూచించారట. దాని కోసం చాలా బాణీలు సిద్ధం చేసి వినిపించారు కీరవాణి. వాటిల్లో ఒకటే ‘తెలుసా మనసా’. ‘కలికి చిలక ముద్దు తాంబూలం ఇమ్మందని’ అంటూ సాగే సాహిత్యంతో కూడిన ట్యూన్‌ వినిపించగా.. సన్నివేశాన్ని సరిపోదనిపించి వద్దన్నారు రాఘవేంద్రరావు. దాంతో మిగిలిన వాటిల్లోని ‘చిలిపి చిలక ఐ లవ్‌ యు అన్న వేళలో’ అనే పాటని ఎంపిక చేసుకున్నారు. కొంతకాలం తర్వాత బాలీవుడ్‌ దర్శకుడు మహేష్‌ భట్‌.. నాగ్‌ కథానాయకుడుగా తెరకెక్కించిన ‘క్రిమినల్‌’లో ఈ బాణీని వాడుకున్నారు. అలాంటి ఈ గీతం ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిన విషయమే. సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం బాలసుబ్రహ్మణ్యం, చిత్ర.

 

Leave a comment

error: Content is protected !!